Banner
Watermark
*జనగణన పనులను సమయానికి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *సెల్ఫ్ ఎన్యూమరేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి*
📅 18 April 2026, 03:35 PM ✍️ admin
News Image
జూలపల్లి, ధర్మారం, ఏప్రిల్ 18: జనగణన 2027 కార్యక్రమాన్ని సమయపాలనతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.

శనివారం జూలపల్లి, ధర్మారం మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాలలో జనగణన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జనగణన కార్యక్రమంలో భాగంగా హెచ్.ఎల్.బీ (హౌస్ లిస్టింగ్ బ్లాక్) నిర్దారణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి 300 ఇండ్లు లేదా 800 జనాభాకు ఒక హెచ్.ఎల్.బీగా విభజించి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ధర్మారం మండలంలో మొత్తం 87 హెచ్.ఎల్.బీలు ఉన్నాయని, ఏ బృందంపై అదనపు భారం లేకుండా సమానంగా పనులను విభజించినట్లు తెలిపారు. ప్రతి హెచ్.ఎల్.బీని మ్యాప్‌ సక్రమంగా గుర్తించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఈసారి జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి అవగాహన కల్పించాలని, కనీసం 20 శాతం మంది ఈ విధానం ద్వారా వివరాలు అందిస్తే ఫీల్డ్ సిబ్బందిపై భారం కొంత తగ్గుతుందని సూచించారు.

హౌస్ లిస్టింగ్ కార్యక్రమం మే 10 నుండి ప్రారంభమవుతుందని, ప్రతి ఇంటి నుంచి అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించాలని తెలిపారు. ఫీల్డ్ సర్వే సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఎన్యుమరేటర్లు సమగ్రంగా పనిచేయాలని ఆదేశించారు.

ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎండాకాలంలో జరుగుతున్నందున, పని సమయాలను ఉదయం తొందరగా, సాయంత్రం వేళల్లో ప్రణాళిక చేయాలని సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నిరంతరం అప్డేట్ చేయాలని, డేటా ఎంట్రీలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

జనగణన కార్యక్రమం అత్యంత ముఖ్యమైనదని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశాల్లో ఎంపీడీవోలు, తహసిల్దారులు, పంచాయతీ కార్యదర్శులు ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home