Banner
Watermark
బాల్య వివాహాల అంతానికి ‘ఆశ’ – నియంత్రణపై మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సు
📅 25 April 2026, 03:00 PM ✍️ admin
News Image
బాల్య వివాహం అంటే కేవలం ఒక చట్టవిరుద్ధమైన పెళ్లి కాదు.. అది బాలికా ప్రపంచపు ఆశల సమాధి. పసి వయసులోనే ఆడ బిడ్డల భవిష్యత్తును బలికాకుండా చూడాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు అన్నారు. నల్సా రూపొందించిన "ఆశ" మార్గదర్శకాలపై కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి గారి ఆదేశాలతో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా 'ఆశ' పై ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో .. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్ రెడ్డిలతో పాటు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి. స్వరూపరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (నల్సా) నూతనంగా రూపొందించిన ఆశ – 2025 (ASHA-2025 - Awareness, Support, Help, Action) కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదని, అది ఆడబిడ్డలకు రక్షణ కవచమని అభివర్ణించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించేలా రూపొందించిన ఈ 'ఆశ' (ASHA) విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపడానికి చట్టాలతో పాటు సామాజిక చైతన్యం కూడా అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవేర్‌నెస్ (Awareness) ద్వారా బాల్య వివాహ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, బాధితులకు సపోర్ట్ (Support) అందిస్తూ సామాజికంగా అండగా నిలవాలని కోరారు. అలాగే ఎక్కడైనా వివాహాలు జరుగుతుంటే హెల్ప్ (Help) లైన్ల ద్వారా సమాచారం అందించి, తక్షణమే చట్టపరమైన యాక్షన్ (Action) తీసుకునేలా వ్యవస్థను అప్రమత్తం చేయాలని వివరించారు. బాల్య వివాహం వల్ల బాలికలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల కలిగే ప్రాణాపాయం మరియు విద్యావకాశాలను కోల్పోవడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. బాల్య వివాహ నిషేధ చట్టం - 2006 ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అలా జరిపించినా లేదా ప్రోత్సహించినా అది కఠినమైన శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. ఆడపిల్లలను కేవలం పెళ్లిళ్లకు పరిమితం చేయకుండా వారిని చదువులో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేర్చడం తల్లిదండ్రులతో పాటు సామాజిక పౌరుల బాధ్యత అని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల గురించి 1098 (చైల్డ్ లైన్) లేదా 15100 (లీగల్ ఎయిడ్) టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని వారు తెలిపారు. న్యాయ సలహాలు, సూచనలు అవసరం ఉన్న వారు నేరుగా కూడా జిల్లా కోర్టులోని జిల్లా న్యాయ సేవా ఆధికార సంస్థను సాంప్రదించి ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమములో ప్యానల్ న్యాయవాదులు కీర్తి శ్రీధర్, నాజియా కుతీజా, సమతా రాణి, అనూష రెడ్డి, నజియా సుల్తానా, అర్చన, ప్రియాంక, డియంసి శ్రీవాణి, సీఓ లు సునీత, మానస, పద్మ, శిక్షణ నమోదిత మహిళలు 100 మంది పాల్గొన్నారు.

-జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కరీంనగర్.
🏠 Home