మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ భరోసా... .....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఏప్రిల్- 29:మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులు తమ పంటను కనీస మద్దతు ధర (MSP)పై విక్రయించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పెద్దపల్లి, పోత్కపల్లి, రేగడిమద్దికుంట, ధర్మారం, జూలపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడినట్లు తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ వెబ్సైట్లో పంట నమోదు చేసుకున్న రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తమ మొక్కజొన్న పంటను విక్రయించవచ్చని తెలిపారు.
మొక్కజొన్న పంటను కౌలుగా పండించిన రైతులు సంబంధిత ఏఈఓ (AEO)ను సంప్రదించి, గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ధృవీకరించబడిన కౌలు ధృవీకరణ పత్రం, కౌలు ఒప్పంద పత్రం (అగ్రిమెంట్ బాండ్), ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను ఏఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
అనంతరం సంబంధిత ఏఈఓలు కౌలు రైతులను ఆన్లైన్లో నిర్ధారిస్తారని తెలిపారు.
తదుపరి, అదే పత్రాలను కొనుగోలు కేంద్రంలోని సెంటర్ ఇన్చార్జ్కు సమర్పించిన పక్షంలో మార్క్ఫెడ్ అనుమతి తీసుకుని కౌలు రైతులకు కూడా మొక్కజొన్న విక్రయానికి అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
అందువల్ల, జిల్లాలోని మొక్కజొన్న రైతులందరూ ఈ సూచనలను పాటించి, కనీస మద్దతు ధర అయిన రూ. 2400 ప్రతి క్వింటాల్కు పొందుటకు తమ పంటను కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.