తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ పరిశీలన
తంగళ్లపల్లి, ఏప్రిల్ -30 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పంటలకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు. టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపుపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాప్ లు, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు సైతం సన్న బియ్యంతో సిద్ధం చేసిన భోజనం పెడుతున్నారని, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి విక్రయానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఎన్నో లాభాలు ఉన్న సన్న రకం వడ్లు, ఆయిల్ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.