రాష్ట్రంలో అగ్రస్థానంలో పెద్దపల్లి ఆసుపత్రి రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలి
పెద్దపల్లి, మే 02: సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపెల్లి జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు
పెద్దపల్లి మండలంలోని బండంపల్లి స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డిసిపి రామ్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి 4 అవార్డులు సాధించిందని, ఓపీ సంఖ్య 280 నుండి 900కు, ప్రసవాలు 40 నుండి 250కు పెరిగినట్లు పేర్కొన్నారు.
కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఎంఆర్ స్కాన్, సీటీ స్కాన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా పెద్దపల్లి ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్, కార్డియాలజీ, 2డి ఎకో వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వడ్డీరహిత రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలని, వరి, మొక్కజొన్నలతో పాటు ఇతర పంటలను కూడా పండించాలని సూచించారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతులకు మద్దతు ఇస్తోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, డైట్ చార్జీల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి వడ్డీరహిత రుణాలు, రేషన్లో సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజల నుండి ఫీడ్బ్యాక్ సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వచ్చిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ప్రతి సోమవారం పురోగతికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
మే 6న వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, సుమారు 100 కంపెనీలు పాల్గొని 2 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోలుపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, ప్రస్తుతం కొనుగోలు వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. వేడి తీవ్రత కారణంగా హమాలి సమస్యలు ఉన్నప్పటికీ రైతులు సహకరించాలని, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.
డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వదంతులు అసత్యమని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజూ స్టాక్లను పర్యవేక్షిస్తూ, ప్రతి పెట్రోల్ బంక్పై నిఘా ఉంచినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి సరిపడా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నానయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, ఆర్డీఓ బి. గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నార
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది