Banner
Watermark
కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 30 May 2026, 11:27 AM ✍️ admin
News Image
మే 30
జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి మిల్లు వారీగా కొనుగోలు వివరాలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రవాణా, అలాగే మిల్లుల వద్ద ఎంత అన్లోడింగ్ పెండింగ్ ఉంది అని కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలన్నారు.

ధాన్యం రవాణాకు సరిపడా అదనపు ట్రాక్టర్లు, లారీలను కేటాయించాలని సూచించారు.

ధాన్యం రవాణా, కొనుగోళ్ల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, ప్రతి కేంద్రంలో అవసరమైన వాహనాలు, హమాలీలు అందుబాటులో ఉంచి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు ఆలస్యం కాకుండా, మిల్లుల వద్ద ధాన్యం ఆగకుండా వేగవంతంగా దిగుమతి అయ్యేలా చూడాలన్నారు.

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీవో నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home