Banner
Watermark
అంగరంగవైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక‌లు
📅 02 June 2026, 12:09 PM ✍️ admin
News Image
జూన్ 02
జనగామ
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని, ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలు సమర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్నిచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచస్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ -2047 దృక్పథంతో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతున్నాయని తెలిపారు.

జనగామ జిల్లా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతమని పేర్కొంటూ, వీరనారి చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయని చెప్పారు.

జిల్లాలో అమలవుతున్న మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, భూ-భారతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, ఇందిరా మహిళా శక్తి, ఆసరా పెన్షన్లు, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మత్స్య, చేనేత, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటి పారుదల, తదితర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నాయని వివరించారు.

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా యంత్రాంగం చూపుతున్న నిబద్ధత అభినందనీయమన్నారు.

(ఇందు వెంట సందేశం ప్ర‌తిని జ‌త‌ప‌ర‌చ‌నైన‌ది)

అనంతరం మైత్రేయ కూచిపూడి వారి గణపతి కౌత్వం, కేజీబీవీ లింగాల ఘనపురం వారి జానపద నృత్యం, సాన్ మారియా పాఠశాల వారి భరత వేదమున, కేజీబీవీ నర్మెట్ట వారి అసైదుల్లా హారతి పాటలకు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన గేయాలకు కేజీబీవీ విద్యార్థులు చేసిన నర్తనలు వీక్షకులను అలరించాయి.

తదనంతరం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ కింద చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో (953) స్వయం సహాయక సంఘాలకు గాను రూ. 71,94,00,000, అలాగే స్త్రీ నిధి రుణాల కింద చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో (191) స్వయం సహాయక సంఘాలకు గాను రూ. 4,90,00,000, అదే విధంగా రబీ, ఖరీఫ్ 2024-25, 2025-26 కు గాను పీపీసీ కింద చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో 12 మండలాల్లోని 332 గ్రామ సంఘాలకు సంబంధించి రూ. 3,21,67,747 చెక్కులను అందజేశారు.

ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద (96) మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, అలాగే రెండు పడక గదుల కింద (175) మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందించారు.

అలాగే సీఎం కప్ - 2025లో భాగంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్రస్థాయికి వెళ్లి అక్కడ చక్కటి ప్రతిభ కనబరిచి, బంగారు, వెండి, కాంస్య మెడళ్లను సాధించిన క్రీడాకారులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుకరించారు.

బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు:
జి. సునీత్ కుమార్ – షాట్‌ పుట్ (జూనియర్ బాలురు అండర్-20), జి. సునీత్ కుమార్ – డిస్కస్ త్రో (జూనియర్ బాలురు అండర్-20), వి. హారిత – వెయిట్ లిఫ్టింగ్ (జూనియర్ బాలికలు అండర్-20), ఎం. రామ్ చరణ్ – పారా సైక్లింగ్

వెండి పతకాలు సాధించిన క్రీడాకారులు:
బి. రమ్య – కరాటే (జూనియర్ బాలికలు), టి. సాయి మేఘన రెడ్డి – కరాటే (సబ్ జూనియర్ బాలురు)

కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులు:
బి. అజేంద్ర – షాట్‌ పుట్ (జూనియర్ బాలురు అండర్-18), జి. వైశాలి – 100 మీటర్ల పరుగు పందెం (జూనియర్ బాలికలు అండర్-20), బి. సోని – జావెలిన్ త్రో (జూనియర్ బాలికలు అండర్-20), ఎం. అక్షర దీపిక – బాక్సింగ్ 46 కేజీలు (జూనియర్ బాలికలు అండర్-16), బి. శివలక్ష్మి – బాక్సింగ్ 50 కేజీలు (జూనియర్ బాలికలు అండర్-16), టి. చరిష్మ – బాక్సింగ్ 57 కేజీలు (జూనియర్ బాలికలు అండర్-16), బి. రామ్ చరణ్ – బాక్సింగ్ 44 కేజీలు (జూనియర్ బాలురు అండర్-16), జనగామ ఫుట్‌బాల్ జట్టు – మూడవ స్థానం (కాంస్య పతకం)

అనంతరం వేసవి శిబిరాల నిర్వహణలో కేజీబీవీ బచ్చన్నపేట, పీఎం శ్రీ జెడ్పీఎస్ఎస్, కేజీబీవీ చౌడారం ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

తదనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా (62) రైతు సేవా కేంద్రాల శిలాఫలకాన్ని, అలాగే వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.

అదే విధంగా భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ALIMCO)/సమగ్ర శిక్ష అధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల (12) పిల్లలకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, తహసీల్దార్లు, ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home