మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిద్దాం
ఎల్లారెడ్డిపేట, జూన్ -05
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్ లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో "ఏక్ పెడ్ మా కే నామ్" పేరుతో ఎక్కువ సాంద్రత కలిగిన మొక్కలను నాటే కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా కలెక్టర్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటడానికి గ్రామంలోని నర్సరీ ద్వారా మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అడవుల శాతం ఎక్కువగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే విషయాన్ని అందరూ గమనించి మొక్కలను పెంచాలని అన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్ నగర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేటు, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు.
అనంతరం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో పిల్లలు ఆడుకునే స్థలం, యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, గజెబో, బెంచీలు, హెర్బల్ గార్డెన్, బుద్ధ విగ్రహం, నీటి మధ్యలో ఉండే బ్రిడ్జ్ ను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
రీల్స్ పోటీలు నిర్వహించి.. విస్తృత ప్రచారం చేయాలి
అర్బన్ ఫారెస్ట్ పార్క్లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
అందరినీ ఆకర్షించేలా పార్క్పై రీల్స్ పోటీలను నిర్వహించాలని, పార్క్లోని విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందు తుందన్నారు. రీల్స్ పోటీలలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్ఓ రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్ఆర్ఓ నాగేశ్వర్ రావు, హరిదాస్ నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.