Banner
Watermark
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి: అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
📅 12 June 2026, 02:15 PM ✍️ admin
News Image
కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి డాక్టర్ అశ్వని తానాజీ వాకడే ఐఏఎస్ గారు పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఎలగందల్, కొత్తపల్లి మండలంలోని విద్యాసంస్థలను సందర్శించి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎలగందల్ మోడల్ స్కూల్, జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్, కేజీబీవీ మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన ఆమె, అక్కడ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవనాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.

పరిశీలనలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను సన్నద్ధం చేయడం అధికారుల బాధ్యత అని పేర్కొన్న అదనపు కలెక్టర్, ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో టీజీడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్ గారు, ప్లానింగ్ సమన్వయాధికారి మిలుకూరి శ్రీనివాస్ గారు, కొత్తపల్లి మండల విద్యాధికారి తుమ్మా ఆనందం గారు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home