మలేరియా నియంత్రణకు ఇంటింటి అవగాహనతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
మలేరియా నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లను అందుబాటులో ఉంచాలని, జ్వరాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
గత సంవత్సరంలో నమోదైన మలేరియా కేసులను విశ్లేషించి, ఈ సంవత్సరం కేసులు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లో/మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని, గ్రామాలు, పట్టణాల్లో మురుగు వ్యవస్థలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్త పేరుకుపోకుండా చూడడం, నిల్వ నీటిని తొలగించడం, పిచ్చి మొక్కల తలగింపు, వంటివి తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, గృహాల పరిసరాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర సంస్థలలో పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న గుంతలు వెంటనే పూడ్చివేయాలని, ఫాగింగ్, ఇతర దోమల నియంత్రణ చర్యలను ఖచ్చితంగా చేపట్టాలని పేర్కొన్నారు. అందుకు అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
ఏప్రిల్ 25న ఉదయం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు మలేరియా నివారణపై ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు.
అదే విధంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం, సర్వేలు నిర్వహించడం ద్వారా వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు.
జిల్లాలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ, మలేరియా నివారణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీపీఓ వెంకట్ రెడ్డి, జెడ్పీ సీఈవో రంగా రావు, జనగామ, ఘనపూర్ (స్టేషన్) మునిసిపల్ మేనేజర్లు రాములు, సత్యనారాయణ, డీడబ్ల్యూఓ కోదండరాములు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, సీపీఓ చినకోట్యా నాయక్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.