• Other News
  • Live TV
  • విద్యార్థులు చదవడం, ఆటల్లోనూ ఉండాలి అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin April 29, 2026, 2:26 pm
    విద్యార్థులు చదవడం, ఆటల్లోనూ ఉండాలి  అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    ఇల్లంతకుంట, ఏప్రిల్ -29సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

    ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ తదితర శాఖల ఆద్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు.

    జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.

    ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి
    గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్, ఇతర సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని, ఓటీపీ, ఇతర వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏపీకే ఫైల్స్ ఫోన్ కు పంపి హ్యాకింగ్ చేస్తారని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, బాలల హెల్ప్ లైన్ 1098, 112, ఇతర సహాయం అందించే అన్ని హెల్ప్ లైన్ నంబర్లూ ప్రతి ఒక్కరూ తమ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని సూచించారు. బాలికలు, కిశోర బాలికలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే సంబంధిత హెల్ప్ లైన్ లో సంప్రదించాలని తెలిపారు.

    విద్యార్థులు ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. డ్రాప్ ఔట్ కావద్దని స్పష్టం చేశారు.

    మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడిగుడ్లు, బాలామృతం, ఇక్రిశాట్ వారి సూచనల మేరకు రూపొందించిన స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు.

    అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, దానికి సంబంధించిన కార్డులో నమోదు చేస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.

    శారీరక, మానసిక ఇతర ఎదుగుదల లోపించిన పిల్లలను ఆర్ బీ ఎస్ కే వాహనాల ద్వారా వేములవాడలోని డీఈఐసీ హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు.

    సైబర్ క్రైమ్ కు గురైతే పోలీసులను సంప్రదించాలి

    జిల్లాలో ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైతే వెంటనే 1930 లేదా సమీప పోలీసులను సంప్రదించాలని ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. ఎలాంటి గుర్తింపు లేని వారు ఫోన్ చేసి ఓటీ పీ, ఇతర వివరాలు చెప్పమంటే స్పందించవద్దని తెలిపారు. క్రెడిట్, డెబిట్ కార్డు యాక్టివేషన్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ నుంచి చేస్తున్నామని ఫోన్లో అడిగే వారికి స్పందించవద్దని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ కాలేదని స్పష్టం చేశారు. అలాగే జనగణన కోసం ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగులు వస్తారని, వారి గుర్తింపు కార్డు, వివరాలు తెలుసుకున్న తరువాత అందరూ తమ వివరాలు వెల్లడించాలని తెలిపారు. మహిళలు, యువతల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు మహిళలు, యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా వాడే అప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అకౌంట్ ప్రైవేట్ అని పెట్టాలని, పబ్లిక్ అని పెట్టవద్దని తెలిపారు.

    జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైవ్.. అలైవ్ కింద వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వెళ్లడంతో నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో బుధవారం ఉదయం ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా వెళ్లడంతో మృతి చెందాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు అయిన రోడ్ సేఫ్టీ కమిటీ బ్లాక్ స్పాట్స్ గుర్తించి.. నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, వేసవి నేపథ్యంలో ఎండలో తిరగవద్దని సూచించారు.

    కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ, సర్పంచ్ గన్నారం వసంత తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర