కామారెడ్డి: జనగణన-2027 కార్యక్రమం పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి ఆశిష్ సంగ్వాన్ కలెక్టర్ ఛాంబర్లో తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "మొదటి దశలో భాగంగా, స్వీయ గణన - సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈరోజు అనగా తేది: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుంది. పౌరులు తమ స్వీయ గణనను అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా పూర్తి చేయవచ్చు" అని పేర్కొన్నారు.
"నమోదు సమయంలో ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య - యూనిక్ ID ఇవ్వబడుతుంది. ఈ IDని గృహ గణన సమయంలో మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు తప్పనిసరిగా ఇవ్వాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్ ద్వారా ఎవరైనా సులభంగా నమోదు చేసుకోవచ్చు" అని వివరించారు.
"జిల్లా ప్రజలందరూ నిర్ణీత గడువులోపు ఈ పోర్టల్లో నమోదు చేసుకుని స్వీయ గణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని మనవి చేస్తున్నాను. మీ భాగస్వామ్యం జిల్లాలో సమర్థవంతమైన ప్రణాళిక మరియు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది" అని కలెక్టర్ పిలుపునిచ్చారు.
"సేకరించిన సమాచారం మొత్తం కచ్చితంగా గోప్యంగా ఉంచబడుతుంది. జనగణన సమాచారం దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన వివరాలు నమోదు చేయాలి" అని కలెక్టర్ సూచించారు.