పెద్దపల్లి, మే-01: కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలని అదనపు కలెక్టర్ డి. వేణు అన్నారు.
శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ డి. వేణు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణు మాట్లాడుతూ మే డే సందర్భంగా అన్ని ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ శ్రామికులేనని, మనందరం శ్రమజీవులమేనని పేర్కొన్నారు.శ్రామిక హక్కులు, ప్రయోజనాలు పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. 1886లో చికాగోలో జరిగిన ఉద్యమాల అనంతరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏర్పడిందని చెప్పారు. భారతదేశంలో 1923 నుండి మే డే వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు.
జిల్లాలోని శ్రామిక సంఘాలకు కార్మిక శాఖ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చూడాలని సూచించారు.కనీస వేతనాల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, జిల్లాలోని సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, కేశోరం వంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కార్యక్రమం అనంతరం మే డే పురస్కారాలను కార్మికులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ వెంకటరమణ, జిల్లా సహాయ కార్మిక అధికారి మొహమ్మద్ రఫీ, జిల్లా ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి,సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.