వేములవాడ, మే -02
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద వేములవాడలో నియోజకవర్గ స్థాయి సభ శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ వీడియో పాటను ప్రదర్శించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.
నేతన్నలకు భరోసా కింద రూ. 4,06,500, కళ్యాణ లక్ష్మి చెక్కులు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల బాధ్యులకు శానిటరీ నాప్కిన్స్ ఇన్సీనేటర్స్, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు.
మహిళా సంఘాల ఫుడ్ స్టాల్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఆయిల్ పామ్ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో సఖి కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామంలో గ్రామ సభలు, మండల స్థాయిలో సభలు పూర్తి చేసుకొని నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆయా సభల్లో గ్రామంలోని సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని, సుమారు 10 వేల కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయని తెలిపారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నం బియ్యం పంపిణీ, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షల పెంపు, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు.
మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్య , వైద్య సేవలకు రాష్ట్రంలో పెద్ద పీట వేస్తున్నదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
నూతనంగా రూ. 200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయిందని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యమంత్రి రాజన్న ఆలయ అభివృద్ధి పై చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పు చేస్తున్నామని తెలిపారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే కుడి ఎడమ కాలువల నిర్మాణ పనులు చేయిస్తామని వివరించారు.మర్రిపల్లి ప్రాజెక్ట్ లో ఈ వర్ష కాలంలో నీరు అవుతామని వెల్లడించారు. మల్కపేట రిజర్వాయర్ మిగతా పనులు పూర్తి చేస్తామని, మిడ్ మానేరు ముంపు గ్రామాల వాసుల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు అయిందని తెలిపారు. జిల్లాలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పోలీస్, రవాణా శాఖ ఆద్వర్యంలో డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.
విద్యార్థులు తమకు ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. డ్రాప్ ఔట్ కావద్దని స్పష్టం చేశారు.
మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, ఇక్రిశాట్ వారి సూచనల మేరకు రూపొందించిన స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.
శారీరక, మానసిక ఇతర ఎదుగుదల లోపించిన పిల్లలను ఆర్ బీ ఎస్ కే వాహనాల ద్వారా వేములవాడలోని డీఈఐసీ హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు.
గ్రామ, మండల సభలు నిర్వహించామని, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రైతులు సన్న రకం వడ్లు, ఆయిల్ పామ్ సాగు చేయాలని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సహకరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వేములవాడ నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు..
రైతు భరోసా 67, 810 మంది రైతులకు 162 కోట్ల 74 లక్షలు, రైతు బుణ మాఫీ 18,488 మందికి 369 కోట్ల 76 లక్షలు, ఇందిరమ్మ ఇండ్లు 2907 ఇండ్లు మంజూరు చేయగా, వివిధ దశల్లో ఉన్న ఇండ్లకు రూ. 146 కోట్ల 51 లక్షలు, మహాలక్ష్మి ఉచిత బస్సు కింద 2 కోట్ల జీరో టికెట్లపై రూ.80 కోట్లు ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 58,314 సిలిండర్లు రూ. 500 లకే పంపిణీ చేయగా, రూ. 2 కోట్ల 91 లక్షలు ఆదా అయ్యాయి. 56,091 మందికి గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. 2 వేల మంది రైతులు సన్న వడ్లు సాగు చేయగా, 500 బోనస్ కింద రూ. 6 కోట్ల 64 లక్షలు అందించారు. వివిధ రకాల పెన్షన్లు 41, 561 మంది పొందుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కింద రూ. 45 కోట్ల 80 లక్షలు అందించారు. నూతన రేషన్ కార్డులు 15, 388 మందికి మంజూరు చేశారు. 69,713 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకుల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.