మే 04 జనగామ ప్రజావాణిలో వివిధ సమస్యలతో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా (151) ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందించి, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులలోని కొన్నింటి వివరాలు
చీటకోడూరు గ్రామం, జనగామ మండలానికి చెందిన కె. గణేష్ యాదవ్, తాను బీసీ - డీ, యాదవ కులం పేదవాడు అని, తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని, భూమి జాగా లేదు అని, ప్రైవేట్ లో చదివించే స్థోమత లేదని, బీసీ సంక్షేమ ఎంజేపీలో చదవాలనే కోరిక ఉందని, కావున సీటు ఇప్పించగలరని దరఖాస్తు చేసుకున్నారు.
పటేల్ గూడెం గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన జే. సురేష్, తనకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం విద్యుత్ తీగల వల్ల ఆగిందని, దీంతో ఆర్థికంగా, ఇంట్లో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసియున్నారు.
సిరిసన్నగూడెం గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన ఎస్. కొమ్రమ్మ, తను నిరుపేద కుటుంబానికి చెందినదని.... తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించుట గురించి ఆర్జీ ద్వారా కోరారు.
వెంకిర్యాల గ్రామం, జనగామ మండలానికి చెందిన మామిడి అంజయ్య, తనకు పెంకుటిల్లు ఉందని, కానీ అది కూలిపోతుందని, ఉండటానికి వీలు లేకుండా ఉందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, డబుల్ బెడ్ రూం ఇల్లు కొరకు వినతిపత్రం సమర్పించనైనది.
చీటూరు గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచి బర్ల గణేష్, గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలకు అదనపు తరగతి గదులు, వంటశాల షెడ్ నిర్మాణాలకు మంజూరు కోరుతూ దరఖాస్తును సమర్పించారు.
ఈ ప్రజావాణి అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి పరిధిలో ఉండే సిబ్బంది స్వీయ గణన నమోదును చేపట్టాలని తెలిపారు.
ఈ ప్రజావాణిలో జెడ్పీ సిఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.