ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేంద్ర నిర్వాహకులను అదేశించారు.
శనివారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని పటేల్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, తదితర అంశాల గురించి ఆరా తీశారు.
అలాగే కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేస్తున్న విధానాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కాంటా ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం అకాల వర్షాల పరిస్థితులు ఉన్నందున రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా వెంటనే గన్నీ సంచుల్లో నింపి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిశీలనలో భాగంగా ట్రక్ షీట్లు, కొనుగోళ్ల రిజిస్టర్లు, తూకం వివరాలను కలెక్టర్ పర్యవేక్షించారు. కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం, రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, తూకం, లోడింగ్, రవాణా ప్రక్రియల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కేంద్రంలో అవసరమైన హమాలీలు, వాహనాలు అందుబాటులో ఉంచి, కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.